Thursday 8 January 2015

ముంబై మీద మళ్లీ ఉగ్రదాడులు?

కాన్ బెర్రా : ముంబై నగరం మీద ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ దేశం నుంచి భారతదేశానికి వెళ్లే ప్రయాణికులకు హెచ్చరికగా తెలిపింది. ముంబై నగరంలోని కొన్ని ప్రధానమైన హోటళ్ల మీద ఈ దాడులు జరగొచ్చని హెచ్చరించింది. ఈశాన్య రాష్ట్రాలు, జమ్ము, శ్రీనగర్ నగరాలతో పాటు.. జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి అయితే అసలు వెళ్లొద్దని తమ దేశ ప్రయాణికులకు ఆస్ట్రేలియా చెప్పింది. ఈ విషయం స్మార్ట్ ట్రావెలర్.జీఓవి.ఏయూ అనే వెబ్ సైట్ లో స్పష్టంగా ఉంది.

ఉగ్రవాద కార్యకలాపాలు జరిగే ప్రమాదం ఉన్నందున, వాహనాల ప్రమాదాల రేటు కూడా ఎక్కువగా ఉండటం వల్ల భారత దేశానికి వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఉగ్రవాదులు భారతదేశంపై దాడులు చేస్తారన్న సమాచారం తమకు తరచుగా వస్తోందని, అందువల్ల ఆస్ట్రేలియన్లు జాగ్రత్తగా ఉండటం మంచిదని హెచ్చరించారు. ముఖ్యంగా భారతదేశానికి సరొగసీ కోసం వెళ్లే ఆస్ట్రేలియన్లు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Blog Archive