Monday 26 January 2015

ఫొటో ఐడి కార్డులతో ఆధార్ డేటా అనుసంధానం

ఆధార్ డేటాబేస్‌ను ఎలక్టోరల్ ఫొటో ఐడి కార్డులకు అనుసంధానం చేయడానికి ఎన్నికల సంఘం పూనుకుంది. ఎన్నికల జాబితాల్లో ఫోర్జరీలు తదితర దుర్వినియోగాలపై వస్తున్న ఫిర్యాదులను తగ్గించడానికి ఇసి ఈ కార్యక్రమానికి పూనుకుంది. ఆధార్ పేరెంట్ బాడీ అయిన యుఐడిఎఐతో కలిసి ఈ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని, 2016 తొలినాళ్ల నాటికి ఇది పూర్తవుతుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) హెచ్.ఎస్.బ్రహ్మ చెప్పారు. 

ఆదివారం ఇక్కడ నిర్వహించిన అయిదో జాతీయ ఓటర్ల దినోత్సవంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోని అర్హుడయిన ప్రతి ఓటరుకు ఎలక్టోరల్ ఫొటో ఐడి కార్డును అందజేశామని, ఇప్పుడు వాటితో ఆధార్ డేటా బేస్‌ను అనుసంధానం చేయడం వల్ల ఓటర్ల జాబితాలు నూటికి నూరు శాతం తప్పులు లేకుండా ఉంటాయని వివరించారు. రెండింటి సమాచారాన్ని ఒక చోటికి చేరడం వల్ల ఓటర్ల పేర్లు, బయోమెట్రిక్స్, చిరునామాలను సవరించవచ్చని ఆయన తెలిపారు. దీనివల్ల ఎన్నికల జాబితాల గురించి రాజకీయ పార్టీలు, అభ్యర్థులు చేస్తున్న ఫిర్యాదుల్లో 99శాతం తగ్గిపోతాయని బ్రహ్మ పేర్కొన్నారు. 

రానున్న ఎనిమిది నుంచి తొమ్మిది నెలల కాలంలో ఈ డేటా అనుసంధాన ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. ఒకవేళ ఆలస్యమయినా 2016 తొలినాళ్ల నాటికి పూర్తవుతుందని ఆయన తెలిపారు. ఆధార్ డేటాబేస్‌లో ప్రతి వ్యక్తికి సంబంధించిన అత్యవసరమైన బయోమెట్రిక్స్, ఇతర కీలక సమాచారం ఉంది.

 ఎన్నికల సందర్భంగా పౌరులందరిని భాగస్వాములను చేయడానికి ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. వచ్చే నెల జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయాలని బ్రహ్మ ఈ సందర్భంగా ఓటర్లను కోరారు.

 ఓటు వేయడం అనేది ప్రతి ఓటరు నైతిక బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. దేశంలో 84 కోట్ల మంది ఓటర్లు ఉండగా, 55కోట్ల మందే ఓటు వేశారని ఆయన చెప్పారు. మిగతా 30 కోట్ల మందిలో కొందరు ప్రమాదాలు ఇతర కారణాల వల్ల, మరికొందరు కావాలనే ఓటు వేయలేదని ఆయన తెలిపారు.

 ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా మంచి వ్యక్తిని ప్రతినిధిగా ఎన్నుకోవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. మంచి నాయకుడిని ఎన్నుకున్నప్పుడే ఆయన మనందరి కోసం పనిచేస్తాడని బ్రహ్మ ఓటర్లను ఉద్దేశించి అన్నారు.

Blog Archive