Monday 18 July 2011

కొంపముంచిన మతిమరుపు.!

హాల్‌టికెట్ మరిచిపోయి ఎగ్జామ్‌కు వెళితే? పెనాల్టీతోనైనా ఎగ్జామ్ ఫీజు చెల్లించే ఆ చివరి రోజు కూడా మరిచిపోతే...? రిసీవ్ చేసుకోవడానికి కచ్చితంగా స్టేషన్‌కు వస్తానని చెప్పి, ఏ ఊరో వెళ్లిపోతే...? వ్యాపారి టాక్స్ చెల్లించాల్సిన లాస్ట్‌డేట్ మరిచిపోతే...? మ్యారేజ్ డే అన్న విషయమే మరిచిపోయి శ్రీవారు ఏ అర్ధరాత్రో ఇంటికి చేరుకుంటే..? అన్నీ అతి ముఖ్యమైనవే! అయినా మరిచిపోవడమేమిటి? అదే మరి! కొన్ని విషయాలను మరిచిపోవడం వల్ల భారీ మూల్యమే చెలించుకోవలసి వస్తుంది.

వాటిలో కొన్ని తిరిగి పూడ్చుకునే అవకాశమే లేని నష్టాలు కావచ్చు. నిజానికి ఆ నష్టాల గురించి తెలియకపోవడం కూడా కాదు. అయినా మరిచిపోతుంటాం. ఒక విద్యార్థి ఫీజు కట్టడం మరిచిపోతే ఒక విద్యాసంవ త్సరమే చేజారిపోయినట్లే కదా! ఒక సంవత్సరం వృధాగా గడిచిపోయాక వచ్చే సంవత్సరం నాటికి ఆలోచనలు మారిపోవనేమీ లేదు కదా! పరిస్థితులు మారిపోవచ్చు. ఏడాది తరువాత మళ్లీ ఆ దిశగా వెళ్లడం సాధ్యమే కాకపోవచ్చు.

అహోరాత్రులు ఎంతో కష్టపడి చదివి, హాల్‌టికెట్ లేకుండా ఎగ్జామ్‌కు వెళితే ఏమిటి పరిస్థితి? మ్యారేజ్ డే మరిచిపోయిన శ్రీవారికి ఇంక ఆ ఏడాది పొడవునా వే ధింపులూ సాధింపులే కదా! నువ్వు ఉన్నావన్న ధీమాతో స్టేషన్‌లో దిగిపోతే నువ్వు ఆ విషయమే మరిచిపోయి అయిపు లేకుండా పోతే కొత్తగా సిటీకి వచ్చిన వారి గతేం కాను? ఈ విషయాల్లో ఎవరినో నిందించాల్సిన పనిలేదు.

అసలు మనల్ని మనమే క్షమించుకోలేం. తమాషా ఏమిటంటే ఇవేవీ మనం కావాలని చేసిన తప్పులు కావు. ఏవో పెద్ద అడ్డంకులు వచ్చి ఆగిపోయామని కూడా కాదు. వాటిని మరిచిపోవడమే సమస్య. ఎందుకిలా అవుతుంది?

కన్న వాళ్లే అన్నీ మోస్తే...
విద్యార్థులు ఫీజు లేదా హాల్ టికెట్ల విషయం మరిచిపోవడానికి కొన్ని సార్లు ఎగ్జామ్స్ తాలూకు ఒత్తిళ్లు కారణం కావచ్చు. ఇక కొందరి విషయంలో అయితే, తమకు సంబంధించినవన్నీ పేరెంట్సే చేసి పెట్టడం కారణంగా ఉంటుంది. అప్పటిదాకా తమ ప్రతి పనీ వారే చేశారు కాబట్టి, ఈ ఫీజులు, హాల్ టికెట్ల విషయాలు కూడా వారికి పట్టవు. అది తమ బాధ్యతగా అనిపించకపోవచ్చు. చివరికి హాల్ టికెట్ తెచ్చారో లేదో ఆ పేరెంట్స్‌ను అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. త మలో ఇలా పేరుకుపోయిన ఉపేక్ష క్రమంగా ఒక మరుపుగా మారిపోవచ్చు.

మనసుకు నచ్చకపోయినా...?
కొన్ని పనులు ముఖ్యమైనవే కావచ్చు. కానీ, అవి మనసుకు నచ్చినవి కాకపోవచ్చు. ఇలాంటి విషయాల పట్ల అంతరంగంలో ఒక ఒక తిరస్కార వైఖరి ఉంటుంది. అందుకే ఆ పనుల పట్ల మనసు పట్టనట్లు ఉంటుంది. వాటిని మనసులోంచి బయటికి తోసేసే ప్రయత్నం కూడా చేస్తుంది. నచ్చని విషయాల పట్ల మనసులో దృఢమైన నిర్ణయం ఏర్పడదు. ఏదో బలంవంతంగా నిర్ణయానికి వచ్చేనాటికి ఆ గడువు కాస్తా దాటిపోతుంది. ఇతరుల బలవంతమే తప్ప తనకు ఏమాత్రం ఇష్టం లే నప్పుడు కూడా మనసులోంచి అది పూర్తిగా వైదొలగిపోతుంది.అది మరపు జాబితాలో చేరిపోతుంది. మెదడుకూ హృదయానికీ మధ్య చోటుచేసుకునే వైరుధ్యాలివి. ఇలాంటి పరిస్థితులో చాలా సార్లు హృద యానిదే పైచేయి అవుతుంది.

ఆత్మీయులకు దూరం కాలేక
కొన్ని సార్లు తాను ప్రేమించే వాటికి దూరం కాలేక కూడా మనసు ఇలాంటి వైఖరిని అలవర్చుకుంటుంది. ఐఐటి ఎంట్రన్సు రాసి సీటు వచ్చేస్తే ఎక్కడో దూరంగా వెళ్లాలి. ఈ క్రమంలో తల్లిదండ్రులకూ, తోబుట్టువులకూ, మిత్రులకూ ఆత్మీయులకూ దూరంగా వెళ్లాలి. ఇది ఏమాత్రం భరించలేని మనసు పలాయనానికి సిద్ధపడుతుంది.

ఆ ఎగ్జామ్‌కు సంబంధించి ఫీజు చెల్లించకపోవడం గానీ, హాల్ టికె ట్ మరిచిపోవడం గానీ జరిగిపోతుంటాయి. ఇవన్నీ చేతన మనసుకు తెలియకుండానే జరిగిపోతాయి. పరీక్షల్లో కొన్నిసార్లు అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయగలిగి కూడా కొంత మంది మధ్యలోనే విరమించుకుంటారు. ప్రతికూలమైన భావోద్వేగాలు, అనుభవాల నుంచి గాయాల నుంచి తప్పించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇలాంటివి చోటుచేసుకుంటాయి.

వర్తమానాన్ని వదిలేస్తూ...
యువతలో ఎక్కువ మంది భవిష్యత్తు తాలూకు ఊహల్లో జీవించడాన్ని ఇష్టపడతారు. ప్రణాళికలన్నీ భవిష్యత్తుకు సంబంధించే ఉంటాయి. ఈ క్రమంలో వర్తమాన విషయాల మీధ «ధ్యాస బాగా తగ్గిపోతుంది. మనసంతా భవిష్యత్తే ఆక్రమిస్తే మనసులో వర్తమానానికి చోటెక్కడిది? వర్తమానంలో బాధ్యతల భారం ఉంటుంది. అందుకే చాలా మందికి భవిష్యత్తు తాలూకు ఊహల్లో గడపడమే హాయి అనిపిస్తుంది. చాలా మందికి వర్తమానం ఒక చేదు అనుభవం. అందుకే వర్తమానంలో చేయవలసిన చాలా పనులు వారి మదిలో ఉండవు. ఇలా నిజాలనుంచి దూరం జరిగే తత్వాన్ని డిసోషియేషన్ ఆఫ్ అమ్నేసియా అంటారు.

నిద్రలేమి...
జ్ఞాపకాలను స్థిరపరచడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. మానసిక ఒత్తిళ్లు తీవవ్రమైనప్పుడు కొందరిలో నిద్రలేమి మొదలవుతుంది. తాత్కాలిక నిద్రలేమి సమస్యలు అంత పెద్ద ప్రభావాన్ని చూపించకపోవచ్చు. కానీ, దీర్ఘకాలిక నిద్రలేమి సమస్యలు క చ్ఛితంగా జ్ఞాపక శక్తిని దెబ్బ తీస్తాయి. ముఖ్యంగా ఎగ్జామ్స్‌కు ముందు యువతీ యువకులు తమ నిద్రా సమయాన్ని బాగా తగ్గిస్తారు. ఇది శారీరక , మానసిక ఒత్తిళ్లను పెంచుతుంది.

అలాగే తాను పనిచేసే సంస్థకు సంబంధించి ఒక పని తరువాత మరోపని వరుస పరంపరగా వచ్చిపడుతుంటే వ్యక్తిగతమైన విషయాల గురించి ఆలోచించే స్థితిని మనిషి కోల్పోతాడు. కుటుంబపరమైనవి, తన వ్యక్తిగతమైనవేవీ తనకు గుర్తు లేకుండా పోతాయి. ఇలాంటి స్థితిలో మన ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలి. అందుకు స్ట్రెస్ మేనేజ్‌మెంట్ నిపుణుల సహకారం కూడా తెలుసుకోవాలి.

ప్లాన్ ఉంటే లేదు తంటా!
ఇష్టమైన పనులే అయినా అన్నీ ఒకసారే చేయలేం కదా! ఏది ఎప్పుడు చేయాలో వాటి ప్రాధాన్యతలను అనుసరించి ఒక ప్రణాళికా లేకపోతే అది కూడా ఒక ఇబ్బందే. పనులు పర్వతంలా ముందు పడి ఉన్నప్పుడు కూడా మనసు వాటినుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అన్నీ చేయాలనే ఆరాటంలో ఏ ఒక్కటీ చేయలేని పరిస్థితిలో పడిపోవచ్చు. ప్రణాళికలేని మనసులో ఒక అయోమయం నెలకొంటుంది. అయోమయం భయాన్నీ,ఆందోళననూ కలిగిస్తుంది.

అందుకే మనకున్న పనులన్నిటినీ ఒక ప్రణాళికా బద్ధం చేసుకోవ డం చాలా ముఖ్యం. వేరెవరూ ఈ పనిని తనంత బాగా చెయ్యలేరని కొందరు అన్నీ తామే చెయ్యాలనుకుంటారు. ఇది విపరీతమైన ఒత్తిడికి గురిచేసి చివరికి ఏ ఒక్క పనీ పరిపూర్ణంగా చేయలే ని స్థితికి చేరుకుంటారు. ఇవన్నీ వైఫళ్యాల వైపే నడిపిస్తాయి. పైగా పరిపూర్ణంగా చేయకపోవడం అలా ఉంచి చాలా పనులను పూర్తిగా వదిలేసే ప్రమాదం ఉంది. అందుకే పని విభజన కూడా చాలా ముఖ్యం.

బోర్డు మీద రాయాలి
జ్ఞాపకం ఉంటాయిలే అనే అతి నమ్మకం చాలా సార్లు ప్రమాదాల్లో పడదోస్తుంది. అందుకే అతి ముఖ్యమైన పనులను ఒక బోర్డు మీద పెద్ద అక్షరాలతో రాసి పెట్టుకోవాలి. వాటిలోనూ ఆ నెలలో చేయవలసినవి, ఆ వారంలో చెయ్య వలసినవి, ఆ రోజే చేయవలసినవి అంటూ కొన్ని విభాగాలుగా రాసిపెట్టుకోవాలి. అప్పుడింక మరిచిపోయే అవకాశం ఉండదు. అయితే ఏది ముందో ఏది వెనుకో ఆ క్రమాన్ని కూడా రాసుకోవాలి. ప్రాధాన్యతను బట్టే ఆ క్రమం ఉండాలి.

యోగా, మెడిటేషన్ విధి నిర్వహణ ఎంత ముఖ్యమైనా శరీరం అనుకూలించక పోతే ఏమీ జరగదు. అందుకే శారీరక ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలి. వ్యాధిగ్రస్తమై, శక్తిహీనమైన శరీరం ఏ బాధ్యతల పట్లా ఆసక్తి చూపదు. అందుకే పోషకాహారం తోపాటు ప్రతిరోజూ ఎంతో కొంత సమయాన్ని యోగా, ధ్యానాలకు కేటాయించాలి.       -Courtesy:Telugu News Paper.