Monday 18 July 2011

చీమలూ ... నిధులూ..!


బంగారం తవ్వే 'చీమల' గురించి ఒక పురాగాథ ఉంది.
భారతదేశంగా భావించబడే ఒక ఎడారి ప్రాంతంలో ఒకనాడు ఇసుకలో కలిసిపోయి బోలెడు బంగారం ఉండేదట. విపరీతమైన వేడి, ఉక్క ఉండే ఆ ప్రాంతంలో ఈ 'చీమలు' తప్ప వేరే జంతువులు ఉండేవి కావట. అవి కుక్కల కంటే చిన్నగా నక్కల కంటే పెద్దగా ఉండేవట. చాలా వేగంగా పరిగెత్తగలిగేవట. ఎండ పెరిగేకొద్దీ అవి ఇసుకను తొలుచుకుంటూ లోపల్లోపలికి వెళ్లిపోతే అడుగు ఇసకంతా పైకొచ్చి పడేదట.
సరిగ్గా అవి లోపలికి వెళ్లిపోయి కునుకు తీసే సమయానికి పసిడి వేటగాళ్లు మూడు ఒంటెల సవారీ కట్టుకెళ్లి బంగారంతో నిండిన ఆ ఇసుకనంతా మూటలు గట్టుకుని వచ్చేసేవారట. ఆ 'చీమల' చేతచిక్కితే చావే కాబట్టి తమ ఒంటెల్లో ఒకటి బాలింత ఒంటె ఉండేలా చూసుకునేవారట. అది బిడ్డ మీద తీపితో ప్రాణాలకు తెగించి పరిగెత్తి వాళ్లను ఎలాగోలా క్షేమంగా తిరిగి తీసుకొచ్చేదట.

***


2500 ఏళ్ల క్రితం హెరొడొటస్ రాసిన ఈ కథనాన్ని చాలా శతాబ్దాల వరకు ఎవరూ నమ్మలేదు. కథో కల్పనో అనుకున్నారు. అబద్ధాలకోరు అని కూడా అన్నారు.

కాని కొన్నేళ్ల క్రితం సింధునది ఎగువన భారత-పాకిస్తాన్ సరిహద్దులో ఒక అధ్యయన బృందానికి సరిగ్గా అటువంటి ఇసుక, అటువంటి 'చీమలు', ఆ వేటగాళ్లను పోలిన ఆదివాసులు కనిపించారట. అయితే ఆ ప్రాంతం సరిహద్దు రేఖ మీదే ఉండడం వల్ల సైన్యంకాల్పులకు భయపడి వాళ్లు మరింత లోతుగా పరిశోధించకపోయినా ఆ 'చీమలు' మనకు తెలిసిన చీమలు కావని, ఉడతల్లాంటివని అర్థం చేసుకున్నారు. పర్షియన్లు వాటిని కొండ చీమలు అనడం వల్ల అందరూ వాటిని ఇంతకాలం చీమలు అనే అనుకుంటూ వచ్చి చీమలేమిటి, బంగారం తవ్వడమేమిటని మరింత ఆశ్చర్యపోతూ వచ్చారు.

***


ఆ కథంతా మనకెందుగ్గాని మన సైన్యం, పాకిస్తాన్ సైన్యం కాసేపు కాల్పులు ఆపితే ఆ 'చీమల్ని' కొన్ని మనం తెచ్చుకోవచ్చు కదా. తెచ్చుకుని దేశమంతా తిప్పితే ఇంకా ఎక్కడెక్కడ బంగారం భూగర్భంలో దాగుందో చెప్పేస్తాయి కదా. అప్పుడు దేశం నిజమైన అర్థంలో ఆగర్భ శ్రీమంతురాలని మనం చెప్పుకుని గర్వించొచ్చు కదా... అప్పుడు అనంత పద్మనాభస్వామి నగలు ఏ మూలకు?