Monday 25 July 2011

రు.700 కోట్ల జగన్ మహల్!



అక్కడెక్కడో ముకేశ్ అంబానీ భారీ భవంతిని కట్టాడని గొప్పలు చెప్పుకున్నాం కానీ, మనకు తెలియకుండానే, మన పక్కనే ఓ భారీ భవంతిని జగన్ నిర్మించాడని తెలుసుకోలేకపోయాం. జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణ పుణ్యమా అని.. ఆ విషయం బయటపడింది. అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ కలిసే.. లోటస్ పాండ్ దగ్గర ఉంది మనం చెప్పుకుంటున్న మహాసౌథం. అందుకే.. ఈ మహల్ కు లోటస్ మహల్ అని పేరు పెట్టుకున్నాడు జగన్. పైకి చూడడానికి మాములుగానే కనిపించినా, విషయమంతా అందులోకి వెళ్లిన వారికే తెలుస్తుంది. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు ఈ నివాసంలోకి కొన్ని రోజుల క్రితం ప్రవేశించారు. 52263 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఐదంతస్తుల రాజభవనాన్ని చూసి వారు అవాక్కయ్యారు. ఒక అంతస్తు నుంచి మరో అంతస్తుకు వెళ్లడానికి సౌకర్యం కోసం పెద్ద సంఖ్యలో లిఫ్ట్ట్లులు, ఎస్కలేటర్లు ఉన్నాయి. 200 సీటింగ్ కెపాసిటీ గల ఓ మినీ థియేటర్, లైబ్రరీ, జిమ్, స్క్వాష్, టెన్నిస్,వాలీబాల్ కోర్టులు ఇందులోకి ప్రవేశించిన వారికి కనిపిస్తాయి. దాదాపు 30 బెడ్ రూములు ఈ మహల్లో ఉన్నాయి. దీని నిర్మాణంలో భాగంగా 24 బోగీల మార్భుల్ రాయిని రాజస్థాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించారు. సాధారణ సింగిల్ బెడ్ రూం ఫ్లాట్ సైజులో రూములు కడితే.. 60 గదులకు ఈ మార్బుల్ సరిపోతుందట. ఇక ప్రత్యేకంగా సెల్లార్ లో మూడు అంతస్తులు పార్కింగ్ కోసమే వదిలిపెట్టారు. లోటస్ మహల్ ఉన్న ప్లాట్ లోనే ఆఫీస్ కాంప్లెక్స్ , సేవకుల కోసం 20 క్వార్టర్లు, రెండంతస్తుల ఔట్ హౌస్ ప్రత్యేకంగా నిర్మించారు. లోటస్ పాండ్ సమీపంలోని హుడాహైట్స్ లో 2,3,4,6,7,8 ప్లాట్లను కొని ఈ మహాసౌథాన్ని జగన్ నిర్మించాడు. ఇందులో మూడొంతులు జగనుకు చెందితే, మరో వంతు ఆయన సోదరి షర్మిలాది. వాస్తవానికి ఈ భవనం విలువ బహిరంగ మార్కెట్లో 700 కోట్ల వరకూ పలుకుతుందని, అయితే, తెలంగాణ ఉద్యమం కారణంగా, ప్రస్తుతం 300కోట్ల వరకూ విలువ చేస్తుందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు.