Thursday 19 March 2015

పరీక్షల సమయంలో పిల్లల భయాన్ని పోగొట్టండిలా...!

సర్వసాధారణంగా పరీక్షలు దగ్గరపడినపుడు, అవి ప్రారంభమైనపుడు పిల్లలు తమ మెదడుని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసేస్తారు. అలా చేయటం మంచిది కాదు. ఈ సమయంలోనే పిల్లలకు మానసికంగా, శారీరకంగా విశ్రాంతి అవసరం. మానసికంగా ఆందోళన చెందితే వారు పరీక్షలు సరిగా రాయలేరు. పైగా అంతకుముందు చదివినదంతా మర్చిపోయే ప్రమాదమూ వుంది. పరీక్షల సమయంలో పిల్లలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటే వారిలో భయం, ఆందోళన వంటివి మాయమవుతాయి.ఇలా చదవడం వల్ల కూడా మానసిక ఆందోళన పెరిగే కొద్దీ పిల్లలు ఎక్కువ చదవలేరు. చదివినా మర్చిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిల్లల్లో ఒత్తిడి ఆందోళన కలగకుండా వారు బాగా చదువుకుని మంచి మార్కులు సాధించాంటే కొన్ని సూచనలు తప్పకుండా పాటించాలి. అవేంటో ఒక సారి చూద్దాం.... 

1. అనుకూలమైన ప్రదేశం కల్పించాలి: పిల్లలు చదువుకోవటానికి నిర్దిష్టమైన స్థలాన్ని లేదా చోటును చూసుకోవాలి. నలుగురు కూర్చున్నచోట కూర్చుని చదవటంవల్ల వాళ్ళేం చదువుతున్నారో వారికి అర్థం కాదు. అందుకని సాధ్యమైనంత వరకూ ఏ విధమైన అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. టీవీనో, డివిడిలో సినిమాలు చూస్తూనే చదువద్దు. మంచంపైన ఫ్లాట్‌గా, బోర్లా పడుకుని చదవకూడదు. ఎలాంటి సందడీ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. మరో ముఖ్యమైన విషయం, రాత్రి పూట మేలుకుని ఉండి, పక్క మీద పడుకుని చదవడం కూడదు, చదువుకు బల్ల, కుర్చీ మేలైనవి. వీటి వల్ల ఏకాగ్రతకు భంగం కలగదు. చదువుకునేందుకు చక్కని భంగిమ కూడా అమరుతుంది. 

2. సమయ పరిధి: చదువుకునేటపుడు అదేపనిగా గంటలకు గంటలు చదవకుండా 40-45 నిముషాలకోసారి చదివేలా నిర్దిష్ట సమయాన్ని పిల్లలే నిర్ణయించుకోవాలి. మధ్యమధ్యలో టీవీ చూడకుండా కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవాలి. 

3. ప్లానింగ్ : ఒకచార్టు తయారుచేసుకుని, దానిలో రోజూ మీరేం చదువుతున్నారో, ఎంత చదువుతున్నారో రాసుకోవాలి. ఆ విధంగా టైంటేబుల్ తయారుచేసుకుని ఒక క్రమపద్ధతి ప్రకారం చదివితే పరీక్షలు సమీపించే సమయానికి సిలబస్ పూర్తిచేయగలుగుతారు. 

4. రిలాక్సేషన్ కోసం: రిలాక్సేషన్ కోసం: అప్పుడప్పుడూ వ్యాయామాలు చేయటంవల్లకూడా మనసుకు సంతోషంగా అనిపించి రిలాక్స్ పొందే అవకాశం వుంది. మనసులో ఎటువంటి భయాలను పెట్టుకోకుండా హాయిగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటే తేలికగా పరీక్షలను ప్రశాంతంగా వారు రాయగలుగుతారు.

 5. ఆహారం: పిల్లల ఆహారం విషయంలో తగినంత శ్రద్ధచూపాలి. నిర్ణీత సమయానికి వారికి సరైన పోషక పదార్థాలతో కూడిన ఆహారాన్ని తినిపించాలి. తగినంత మంచినీరు కూడా తాగేటట్లు చూడాలి.పౌష్టికాహార లోపంవల్ల ఆరోగ్యం పాడవుతుంది. ఆ కారణంగా పరీక్షలు సరిగా రాయలేకపోతారు. కాబట్టి సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి. టీ, కాఫీలు వంటివి మానేయాలి. 

6. నిద్ర: వేళకు తిండి తినకపోయినా, రాత్రిళ్ళు నిద్రపోకపోయినా శారీరకంగానూ, మానసికంగానూ అలసి పోయి చదువుపై ఆసక్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గాక చదివేది అర్థం కాదు. దానితో జవాబులను బట్టీ వేయాలని చూస్తారు. ఇక సమస్యలు ప్రారంభమవుతాయి. ఇది గమనించి వారికి తిండి, నిద్ర సక్రమంగా లభించేట్లు చూడాలి. చదవాలి కదా అని తెల్లవార్లూ కూర్చోబెట్టకుండా తగినంత నిద్ర అవసరం అని గుర్తించాలి. 

7. ఒత్తిడి కూడదు: ప్రతిరోజూ ఉదయం 8 గంటలనుండి రాత్రి 8 గంటలవరకూ అంటే పనె్నండు గంటల పాటు పిల్లలకు స్కూలు, ట్యూషన్‌తోనే సరిపోతుంది. ఇక పరీక్షలు వచ్చిన సమయంలో నిరంతరం చదుతూనే వుంటారు. ఇలా ఎప్పుడూ చదువులో మునిగితేలుతూంటే వారిలో మానసిక ఒత్తిడి పెరిగి అనార్యోం పాలవుతున్నారు. పిల్లలపై ప్రతినిత్యం తల్లిదండ్రులు ఈ విధంగా ఒత్తిడి చేయడం, చదువు విషయంలో కఠినంగా ప్రవర్తించటం మంచిది కాదు. 

8. టెస్ట్ : స్కూలులో ఎలాగా టెస్ట్‌లు పెడతారు కదా అని బద్ధకించకూడదు. వాళ్ళకి వాళ్ళే స్వయంగా ఇంట్లో టెస్ట్ పెట్టుకుంటే పరీక్షలంటే భయం పోయి వారిపై వారికి ధైర్యం, నమ్మకం ఏర్పడతాయి. ఆత్మవిశ్వాసం. 

9. నెగెటివ్ థింకింగ్: చదువుకు సంబంధించి మనసులో ఏ విధమైన నెగెటివ్ థింకింగ్ (వ్యతిరేకంగా ఆలోచించటం)ను పెంపొందించుకోకూడదు. ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచించుకోవాలి. అప్పుడు భయం, ఆందోళన లాంటివి దరిచేరవు. 

10. నిపుణుల సలహా: విద్యార్థినీ విద్యార్థులు మానసిక వత్తిడికి లోనైతే కనుక ఒకసారి మానసిక వైద్య నిపుణులను సంప్రదించటం మంచిది. నిపుణుల కౌనె్సలింగ్ వల్ల పిల్లలలో నూతనోత్సాహం వస్తుంది. ఇక పిల్లల చదువుకు సంబంధించి తల్లిదండ్రుల పాత్ర ఎలా వుంటుందో పరిశీలిస్తే- పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు అన్నివిధాలా సహకరించాలి. ఆ సమయంలో వారికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం తల్లిదండ్రుల బాధ్యత. అంతేకాక పిల్లల ఆరోగ్యం విషయంలోనూ తగిన శ్రద్ధ తీసుకోవాలి. పిల్లలు ఏ విధమైన మానసిక, శారీరక వత్తిడులకు లోనుకాకుండా చూసే బాధ్యత కూడా తల్లిదండ్రులదే.

Blog Archive